ఛత్తీస్గఢ్ (Chhattisgarh), బీజాపుర్ (Bijapur)జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్ (Naxal) మరణించారని సమాచారం.. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది.

దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు.. కాల్పుల ఆగిన అనంతరం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.. అంతేగాక ఘటనా స్థలంలో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించారు.. కాగా ఈ కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ ఇంతటితో ముగియలేదని.. బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని సుందర్ రాజ్ పేర్కొన్నారు.. మరోవైపు బీజాపుర్ జిల్లా బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాంటీ-నక్సల్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.