Telugu News » Madhya Pradesh : కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీ గూటిలో చేరిన 100 మంది కీలక నేతలు.. !

Madhya Pradesh : కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీ గూటిలో చేరిన 100 మంది కీలక నేతలు.. !

బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దాలని, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.

by Venu

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి.. నేతలు అధికారంలో ఉన్న, మరో సారి అధికారం చేబడుతుందని భావిస్తున్న పార్టీలోకి మారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు బీజేపీ కండువా కప్పుకొన్నారు.. లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హరివల్లభ్ శుక్లా, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ రఘువంశీతో సహా పలువురు నేతలు బీజేపీ (BJP) గూటికి చేరారు.. వీరంతా సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ కొత్త చేరికల సంఘం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ నరోత్తమ్ మిశ్రా సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఈ సంఘటన పెద్ద షాక్ ఇచ్చినట్లుగా చెప్పుకొంటున్నారు..

మరోవైపు సీఎం మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దాలని, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ లో బంధుప్రీతి మాత్రమే కనిపిస్తోందని విమర్శలు గుప్పించ్చిన ఆయన.. బీజేపీ ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో చింద్వారాతో సహా మొత్తం 29 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోసారి మోడీ (Modi) అధికారంలోకి రావడం ఖాయని తెలిపిన మోహన్‌ యాదవ్‌.. మాజీ సీఎం కమల్ నాథ్‌ పై వ్యంగాస్త్రాలు వదిలారు.. ఓట్లు అడిగేందుకు తన ఇంటి నుంచి మొదటిసారిగా పెద్ద మహారాజ్ చేతులు జోడించి బయటకు వచ్చారన్నారు. అతని చింద్వారా (Chindwara) మోడల్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు..

You may also like

Leave a Comment