బీఆర్ఎస్ పార్టీనే ఒక దేవాలయం…. కేసీఆర్ (KCR) ఒక దేవుడు అని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ఎవరికైనా బాధ కలిగిస్తే తనను క్షమించాలని కోరారు. దళిత బంధు విషయంలో ఏ మండలంలో ఫ్రాడ్ జరగలేదని అన్నారు. కానీ ఒక మద్దూరు మండలంలో జరిగిందని, తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మీడియా సమావేశంలో ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ…..2002లో కేసీఆర్ చిత్తశుద్ది, ఆయన వాక్చాతుర్యాన్ని నమ్మి పార్టీలోకి వచ్చానని అన్నారు. ఇప్పుడు మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నానని, అందుకే తనపై కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్ విషయంలో కుటుంబ సమస్యలు తీసుకు వచ్చి తనకు టికెట్ రాకుండా చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ మాటకు విలువిచ్చి తాను గెలిచే సీటును సైతం వదులుకున్నానని అన్నారు. ఇప్పడు ఎంపీ టికెట్ వస్తుందనే ఇలా అంబాండాలు వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో వంద ఎకరాలను అమ్మి ఆ డబ్బును పార్టీ కోసం ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. అదితనకు చాలా సంతృప్తని కలిగించిందని వెల్లడించారు.
దళితబంధులో ఎలాంటి స్కాంలు జరగవద్దని అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పానని గుర్తు చేశారు. 62 లక్షలు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారని, అదంతా పూర్తిగా అసత్యమని సష్టం చేశారు. దళితుల దగ్గర తీసుకున్న డబ్బులను బద్దిపడగ కృష్ణారెడ్డి వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవ తీసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు చెప్పారు.