ప్రతి ఏడాది గణతంత్ర వేడుకల రోజు రాజ్ భవన్ (Raj Bhavan)లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులను రాజ్భవన్కు గవర్నర్ (Governor) ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాజ్ భవన్లో ఇది మొదటి ఎట్ హోం కార్యక్రమం కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ, పార్టీ ముఖ్య నేతలు కానీ హాజరు కాలేదు.
ఆ పార్టీ నుంచి కేవలం ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, గోరటి వెంకన్నలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తీరు మారడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా వుంటే గవర్నర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలని కోరారు.
గణతంత్ర దినోత్సవ వేదికపై రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని చెప్పారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. అంతకు ముందు కేటీఆర్ కూడా గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ బాధ్యులు కాదని, కేవలం ప్రజలకు బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.