కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన రద్దు అయింది. ఈ నెల 28న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మూడు జిల్లాల నేతలతో కీలక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజాగా అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు.
అత్యవసర పనుల నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు రాలేకపోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడినట్టు చెప్పారు. దీంతో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలను వాయిదా వేశామని వివరించారు. బిహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది.
బిహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. రేపు జేడీయూ నేతలు గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేపు జేడీయూ నేతలతో సీఎం నితీశ్ కుమార్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది.
మరోవైపు బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమ గవర్నర్ కు లేఖ అందిచేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.