బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎప్పుడు బయటకు వెళ్లినా భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో వెళతారు. ఆయన చుట్టూ పార్టీ నేతలు, మీడియా హడావుడి ఉంటుంది. కానీ తాజాగా దీనికి భిన్నంగా కేటీఆర్ ప్రయాణించారు. ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆటోలో ప్రయాణించారు.
తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు జూబ్లిహిల్స్ నియోజక వర్గానికి సంబంధించి సమీక్షను నిర్వహించారు. అందులో భాగంగా నియోజక వర్గానికి సంబంధించిన విషయాల గురించి చర్చించారు.
సమావేశం ముగిసిన తర్వాత ఓ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో కేటీఆర్ యూసఫ్ గూడ నుంచి జూబ్లిహిల్స్ వెళ్లారు. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఆటో ఎక్కే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో తమ పరిస్థితి దయనీయంగా మారింది ఆటో వాలాలు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో వారి పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేటీఆర్ ఆటోలో వెళ్లినట్టు తెలుస్తోంది. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటోవాలాల సమస్యల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆటో వాలాల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆటో వాలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.