సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో బీఆర్ఎస్ (BRS)నేతల వరుస భేటీలు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఆయా నేతలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ మరో నేత రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ కావడంపై ఆసక్తి రేపుతోంది. జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని గద్వాల విజయ లక్ష్మీ కలిశారు. దీంతో ఆమె కూడా కాంగ్రెస్లో చేరతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో భేటీపై మేయర్ గద్వాల విజయ లక్ష్మీ వివరణ ఇచ్చారు. తా.ను కేవలం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్, జనరల్ బాడీ సమావేశం, రివ్యూ మీటంగ్ల కోసమే తాను సీఎంను కలిశానన్నారు.
త్వరలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎంపీ టికెట్ ఆశించిన వారు టికెట్లు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సీఎంను కలవడంతో… వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా వుంటే మేయర్ విజయలక్ష్మితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. అటు గద్వాల విజయ లక్ష్మీ, ఇటు బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు.. అందుకే ఇద్దరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు చర్చ నడుస్తోంది.