వేసవి(Summer) ప్రారంభం కాకముందే తెలంగాణ(Telangana)లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు(Temperature) క్రమంగా పెరుగుతున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయని హైదరాబాద్లో 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి భానుడి తాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్ లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చివరి వారంలో 36 డిగ్రీలకు చేరుకుంది. ఖమ్మంలోనూ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోనూ ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లో సాధారణం కంటే 3.7 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
మార్చి నెల ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ఎండలు కాస్త ముందుగానే చెమటలు పట్టిస్తున్నాయి. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో ఇదే గరిష్ఠ పెరుగుదల అని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.