ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Ys Jagan Mohan Reddy)పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (Vishnu Kumar Raju) తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. ప్రపంచంలో జగన్ లాంటి నాయకుడు మరెక్కడా ఉండడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలించిన సీఎం జగన్ ఒక్కడే అని విమర్శలు గుప్పించారు.
మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం జగన్ దొంగ హామీలు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. నాలుగేళ్లు ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ…. ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారంటూ నిప్పులు చెరిగారు.
నాలుగేళ్లు కేవలం దోపిడీకే కేటాయించారని ఆరోపించారు..ఇంత కాలం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన జగన్కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తప్పదని వెల్లడించారు.
జగన్ సీఎం పదవి కాదు కదా.. కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ వ్యహారాలన్నింటినీ తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి చూసుకుంటారని వెల్లడించారు. త్వరలో అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్తామన్నారు.