కాంగ్రెస్ (Congress) సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోజూ మేడిగడ్డ… మేడిగడ్డ అని అంటుంటే ప్రజలు బేజారవుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ తప్ప మరే సబ్జెక్ట్ దొరకడం లేదంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ అయ్యాయంటూమేడి గడ్డ ప్రాజెక్ట్లో ఏదో లీకేజీ అయిందని అన్నారు. దాన్ని సరిచెయ్యాలని కోరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అని.. ఆయనకి అప్పగిస్తే సరి చేస్తాడంటూ సూచించారు.
మరోవైపు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మీడియాతో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించింది నిజాం రాజులు కాదని అన్నారు.
ఆ ప్రాజెక్టును వనపర్తి రాజులు నిర్మించారని వెల్లడించారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టారో కూడా నీటి పారుదల శాఖ మంత్రికి తెలియక పోవడం బాధాకరమని చెప్పారు. శాసనసభ సాక్షిగా అసత్య ప్రచారాలు చేయడం కాంగ్రెస్ మంత్రులకు, పార్టీకి ఉన్న అవగాహనకు ఇది నిదర్శనమని వెల్లడించారు.