Telugu News » AP Cabinet : ఏపీ కేబినెట్ నిర్ణయాలు…ఉద్యోగులకు వరాలు

AP Cabinet : ఏపీ కేబినెట్ నిర్ణయాలు…ఉద్యోగులకు వరాలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు.

by Prasanna
AP cabinet

ఇవాళ అమరావతి (Amaravathi) లోని సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) పై వరాలు కురిపించింది. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై కూడా నిర్ణయాలు తీసుకుంది. అలాగే రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని నిర్ణయించింది.

AP cabinet

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే నాటికి సొంత ఇంటి స్ధలం ఉండేలా చూడాలని నిర్ణయించారు. రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్ధులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహనికి ఆమోదం తెలిపింది. దీని కింద ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు లక్ష రూపాయలు, మెయిన్స్ లోనూ అర్హత సాధిస్తే మరో 50 వేలు అదనంగా ఇస్తారు. సామాజికంగా, ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే కురుపాం ఇంజనీరింగ్ కాలేజీలో 50 శాతం గిరిజనులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకూ ఆమోదం తెలిపారు.

You may also like

Leave a Comment