మంత్రి కోమటిరెడ్డి (Koamti Reddy Venkat Reddy) వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంట వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కృష్ణాజలాలపై చర్చ సందర్బంగా మాటల తూటాలు పేలాయి.
నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గిందని హరీశ్ రావు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. దీంతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మధ్యలో కల్పించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత కేసీఆర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని చెప్పుతో కొడతామని తాము అనలేమా అని ప్రశ్నించారు. అమేథీలో రాహుల్ని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని అన్నారు.
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సభాపతి ఏకపక్షంగా మంత్రికి అవకాశం ఇవ్వడం సరికాదని అన్నారు. మంత్రి క్షమాపణలు చెబితేనే తాను మాట్లాడతానని హరీశ్ రావు పట్టుబట్టారు. దీంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. దీంతో హరీశ్ రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.