Telugu News » వైఎస్‌ వ్యక్తిగత అనుచరుడి పై కేసు నమోదు!

వైఎస్‌ వ్యక్తిగత అనుచరుడి పై కేసు నమోదు!

మామ సూరీడు, ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడి అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

by Sai

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు సూరీడుపై కేసు నమోదైంది. ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడుతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టిన మామ సూరీడు, ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడు అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు.. కోర్టు ఆదేశంతో వీరిపై కేసు నమోదైంది.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సూరీడు కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సూరీడు  కుమార్తె తన భర్తపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2021 మార్చి 23న రాత్రి సురేందర్‌రెడ్డి తన కుమార్తెను చూడడానికి జూబ్లీహిల్స్‌లోని తన మామ సూరీడు ఇంటికి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల మధ్య గొడవ జరగ్గా.. అల్లుడిపై సూరీడు దాడిచేశారు.

జూబ్లీహిల్స్‌ పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేతిలోని క్రికెట్‌ బ్యాట్‌ను, బైక్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సురేంద్రనాథ్‌రెడ్డి.. తనను చంపేందుకు యత్నించాడంటూ సూరీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు.. ప్రస్తుతం ఏపీలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారితో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూరీడు, రాజశేఖర్‌రెడ్డి, నరేష్‌, ఏపీ ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

సురేందర్ రెడ్డి మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుబ్బయ్య ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఏపీ ఐపీఎస్‌ అధికారిపై సురేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 2021లో జరిగిన ఈ గొడవ, కేసు వ్యవహారంలో అప్పట్లోనే హాట్‌టాపిక్ అయ్యింది. అయితే సూరీడు అల్లుడు కోర్టును ఆశ్రయించడంతో రివర్స్‌లో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏపీ ఐపీఎస్ అధికారి పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది.. చర్చ జరిగింది.

You may also like

Leave a Comment