Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
కాంగ్రెస్ (Congress)పై మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రంగా విరుచుకు పడ్డారు. పొరబాటున తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే మూడు గంటల కరెంట్ దిక్కవుతుందని చెప్పారు. కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణలో 3 గంటల విద్యుత్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మూడు గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా? రైతులే తేల్చుకోవాలని అన్నారు. నీళ్లు, కరెంట్, ఎరువులు ఇవ్వని వాళ్లను మళ్లీ గెలిపించాలా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు అవకాశం కావాలంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఏ ఒక్కరినీ కూడా కాంగ్రెస్ ఓన్ చేసుకోలేకపోయిందన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు. వాళ్ల మాటలు నమ్మి మోస పోవద్దని ప్రజలకు ఆయన సూచించారు. కర్ణాటకలో కరెంట్ లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పుడే గాడిన పడుతోందని, రాష్ట్రాన్ని గద్దలపాలు చేయొద్దని ఆయన సూచించారు.
ప్రతీ నాయకున్ని, ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుందని చెప్పారు. బీఆర్ఎస్ను తమ ఇంటిపార్టీగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. విద్యుత్ సమస్య, నీళ్ల సమస్య పరిష్కరించు కున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కరీంనగర్ జిల్లా అంతా పచ్చగా మారిందని వెల్లడించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కార్యకర్తలకు మంత్రి వివరించారు. కేసీఆర్ భరోసా పేరిట 15 కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. మరోసారి కేసీఆర్ సర్కార్ వచ్చాక జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.









