Telugu News » KTR : కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అంధకారమే!

KTR : కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అంధకారమే!

మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టిందన్న కేటీఆర్... ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీది కూడా గంగలో కలిసిపోయిందని విమర్శలు చేశారు.

by admin
KTR

కాంగ్రెస్ (Congress) పార్టీ రెండో విడత పాదయాత్ర సందర్భంగా కర్ణాటక టీపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ (DK Sivakumar).. తెలంగాణ (Telangana) సర్కార్ ను టార్గెట్ చేశారు. దమ్ముంటే కర్ణాటకకు రావాలని.. అక్కడ తామ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామని బీఆర్ఎస్ (BRS) నేతల కామెంట్స్ కు సవాల్ విసిరారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవెర్చట్లేదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అది మీ చేతకానితనానికి నిదర్శనమంటూ డీకే కామెంట్స్ పై మండిపడ్డారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని.. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అంటూ సెటైర్లు వేశారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరని.. తెలంగాణ ప్రజలు విశ్వసించరని అన్నారు కేటీఆర్. ‘‘ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదు గంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో పవర్ కట్ లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి’’ అని విమర్శించారు.

అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కిందన్న కేటీఆర్… కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారని చురకలంటించారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న తమ సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసీని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారిందని విమర్శించారు. సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్యా ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలని అన్నారు.

మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టిందన్న కేటీఆర్… ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీది కూడా గంగలో కలిసిపోయిందని విమర్శలు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోందన్న ఆయన.. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన హస్తాన్ని నమ్మి మోసపోవడానికి తమ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డా అని తెలిపారు కేటీఆర్.

You may also like

Leave a Comment