Telugu News » Revanth Reddy : బక్కోనివి కాదు బకాసురుడివి.. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : బక్కోనివి కాదు బకాసురుడివి.. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

దుబ్బాకను బంగారు తునక లాగా చేస్తామని అటు కేసీఆర్, ఇటు హరీశ్ రావు హామీ ఇచ్చారన్నారు. కానీ పదేండ్లు పూర్తయిందని, ఇప్పుడు దుబ్బాకను బొందల గడ్డగా మార్చారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

by Ramu
revanth reddy fire on kcr family in dubbaka public meating

దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ కుటుంబం (KCR Family) అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫైర్ అయ్యారు. దుబ్బాకను బంగారు తునక లాగా చేస్తామని అటు కేసీఆర్, ఇటు హరీశ్ రావు హామీ ఇచ్చారన్నారు. కానీ పదేండ్లు పూర్తయిందని, ఇప్పుడు దుబ్బాకను బొందల గడ్డగా మార్చారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ మందేసి మాట్లాడుతారా లేక మతి లేక మాట్లాడుతారో అర్థం కాదన్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఈ దుబ్బాక గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉందన్నారు. గతంలో దుబ్బాకకు రావాల్సిన నిధులను కేసీఆర్ సిద్దిపేటకి తరలించాడన్నారు. కేసీఆర్‌తో కొట్లాడి మరి దుబ్బాకకు నిధులు తీసుకు వచ్చిన ఘనత దివంగత ఎమ్మెల్యే ముత్యం రెడ్డిదని గుర్తు చేశారు.

ఇప్పుడు దుబ్బాక నిధులను హరీశ్ రావు సిద్దిపేటకు తీసుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు. దుబ్బాకకు వచ్చిన ఆస్పత్రులు, కాలేజీలను రద్దు చేసి వాటిని మామా అల్లుళ్లు సిద్దిపేటకు తీసుకు వెళ్లారని ఆరోపణలు గుప్పించారు. దుబ్బాక ఉప ఎన్నికలో వాళ్ల బంధువు గెలవాలని బీజేపీ అభ్యర్థిని గెలిపించారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఆగదన్నారు. ఎవరికి డబుల్ బెడ్ రూమ్ రాలే కానీ పక్కనే ఎర్రవల్లిలో కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని నిప్పులు చెరిగారు.

వచ్చే నెల నుంచి కేసీఆర్‌కు 4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పారు. కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూమ్ చర్లపల్లి జైలులో కట్టిస్తామన్నారు. సీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. బీజేపీ నేతలే బండి సంజయ్ పై ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ కుమ్ములాటలు తప్ప ఇక్కడ ఏం చేయలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని రఘునందన్ రావు అన్నారని పేర్కొన్నారు.

ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఆయనకి ఓటు అడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉందన్నారు. కానీ అది పాత చింతకాయ పచ్చడని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే కేసీఆర్ కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.

ఊర్లు తిరుగుతూ సీఎం కేసీఆర్ వగల ఏడుపులు ఏడుస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నేను బక్కోన్ని..కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారు’అని కేసీఆర్ అంటున్నారని పేర్కొన్నారు. నువ్వు బక్కోనివి కాదు బకాసూరునివి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment