తెలంగాణ (Telangana)లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే కార్యచరణ ప్రారంభించాయి. కాగా బీఆర్ఎస్ (BRS) అసెంబ్లీ ఓటమిని మరచిపోవడానికి ప్రయత్నిస్తూనే.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూ ఊరుతోంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ (KTR) స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఓటమి జస్ట్ స్పీడ్ బ్రేకర్ గా పోల్చారు..
నేడు సిరిసిల్ల సర్వసభ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు కొన్ని రోజులు సర్వీసింగ్కు వెళ్లిందే తప్ప మరేమి కాలేదని అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రైతు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. నేటికీ కూడా రైతుల అందరి ఖాతాల్లో ఆ డబ్బులు వేయ్యకపోవడం ఏంటని మండిపడ్డారు.
మరోవైపు ఈ సభలోనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారని తెలిపారు. ఇదిలా ఉండగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసిన వినోద్..బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి బీఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ పార్లమెంట్ నుంచి వినోద్ ని బరిలోకి దించాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.