వివాదాలకు దూరంగా ఉండే హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh)కు ఊహించని షాక్ తగిలింది. భూ వివాదానికి సంబంధించి వెంకటేశ్తో పాటు ఆయన సోదరుడు సురేశ్ బాబు, నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati),అభిరామ్లకు నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను నాం పల్లి కోర్టు ఆదేశించింది.
డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఆ హోటల్ యజమాని నంద కుమార్ నాం పల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో కోర్డు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా హోటల్ ను కూల్చి వేశారని నందకుమార్ ఫిర్యాదులో తెలిపారు. దీంతో పాటు ఫర్నిచర్ను ఎత్తుకుని వెళ్లారని పేర్కొన్నారు. దీని వల్ల తనకు సుమారు రూ. 20 కోట్ల వరకు నష్టం కలిగిందన్నారు.
ఆ స్థలం విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీ తప్పుడు పత్రాలను సృష్టించిందని నందకుమార్ ఆరోపించారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని అక్రమంగా తన హోటల్ ను కూల్చి వేశారని వెల్లడించారు. అందువల్ల కూల్చివేతకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంకటేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఐపీసీ 448, 452, 380లతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దగ్గుబాటి కుటుంబం నుంచి తనకు ప్రాణా హాని ఉన్నట్టుగా పిటిషన్లో తెలిపారు.