సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే (Government Whip, Vemulawada MLA) ఆది శ్రీనివాస్(Adi Srinivas) గుడ్న్యూస్ చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
సిరిసిల్లను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. జ్యోతి రావు ఫూలేను ఎప్పుడైనా గుర్తు చేసిందా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిని కూడా తీర్థ యాత్ర చేసిన చందంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయంటూ విమర్శించారు.
కరీంనగర్లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ‘సిరిసిల్లలో ఒక్కరికైనా ఉపాధి కల్పించావా కేటీఆర్..’ అంటూ మండిపడ్డారు. మున్సిపల్ కరెంటు బిల్ కట్టని చరిత్ర మీదంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇప్పటికైనా అహంకార మాటలు మానుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం, పేదల ప్రభుత్వమని తెలిపారు.