బీఆర్ఎస్ (BRS) పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేసీఆర్ (KCR) మళ్లీ జన్మలో సీఎం కాలేరని తెలిపారు. మరో మూడు నెలల్లో మళ్లీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేదవర్రా అంటూ నిప్పులు చెరిగారు.
ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్ నిర్మాణ సభ పేరిట పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ…. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడితే జనం చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
చెరుకు తోటలో అడవి పందులు పడినట్టు తెలంగాణను కేసీఆర్ విధ్వంసం చేశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదన్నారు. కానీ అప్పుడే బీఆరఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పదేండ్లలో కేసీఆర్ చేయనిది.. తాము రెండు నెలల్లోనే ఎలా చేస్తామని ప్రశ్నించారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కాదు కదా.. కనీసం మంత్రి కూడా కాలేరని అన్నారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్కు సీఎం కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనుకుంటే.. కేసీఆర్ కూడా నిత్యనంద స్వామిలా ఒక దీవి కొనుక్కుని ఇక దానికి సీఎం కావాల్సిందేనని ఎద్దేవా చేశారు.