కాంగ్రెస్ (Congress) సర్కార్ చేతకాని ప్రభుత్వమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ వి మాటలే తప్ప చేతలు లేవని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 420 హామీలను చూసి ప్రజలు మోసపోయారని అన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ను బొందపెట్టుడేనని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉప్పల్ జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా? అర్థం కావడం లేదని తెలిపారు. యాభై వేల మెజారిటీతో గెలిపించిన ఉప్పల్ నియోజక వర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో గెలుపు తమదేనన్నారు.
కాంగ్రెస్ను మల్కాజ్గిరిలో మడత పెట్టీ కొట్టుడేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చుతామని అన్నారు. అప్పటివరకు ఏం చేస్తారో చూద్దామని అన్నారు.
ప్రజలు తమకు రెండు సార్లు అవకాశం కల్పించారని.. రాజకీయాల్లో చీకటి వెలుగులు సర్వ సాధారణమని వెల్లడించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని.. నికృష్ట కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో జనానికి తెలుస్తుందన్నారు.
లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చని.. తనకైతే తెల్వదన్నారు. రేవంత్రెడ్డి లాగా తాము తిట్టగలుతామని.. మొన్నటి ఫలితాలు తమ మంచికే వచ్చాయని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు.