తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 13 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ రోజు ఉదయం మొదట ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ( Tamilisai Soundararajan) ప్రసంగించారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు.
ఈ నెల 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో వార్షిక బడ్జెట్ ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టనున్నట్టు సమచారం. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతి పక్ష హోదాలో ఇటు బీఆర్ఎస్ కు ఇది తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తి చూపుతూ పార్టీని ఇరుకున పెట్టాలనీ బీజేపీ రెడీ అవుతోంది. అటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ఇరు పార్టీల మధ్య బిగ్ వార్ నడుస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఇది ఇలా వుంటే గురువారం అసెంబ్లీలో బీఏసీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షత వహించారు. శాసన సభ పని దినాలను బీఏసీ సమావేశాల్లో ఖరారు చేశారు. ఇక బీఏసీ సమావేశానికి తన బదులుగా హరీశ్ రావు హాజరవుతారని కేసీఆర్ ముందే వెల్లడించారు. చెప్పినట్టుగానే హరీశ్ రావు బీఏసీకి రాగా మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఏసీ సమావేశం నుంచి హరీశ్ రావు వెంటనే వెళ్లిపోయారు.