నేటి బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా సాగుతూనే ఆసక్తికరంగా మారాయి.. ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకొన్నాయి. అయితే ఎప్పుడు కాంగ్రెస్ పై పంచ్ లతో విరుచుకుపడే కేటీఆర్ ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ముచ్చటించడం నేతల చూపులను ఆకట్టుకొనేలా చేసింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పలకరించుకొని మాటల్లోకి దిగారు..
ఈ సందర్భంగా కేటీఆర్.. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని అడిగారు. దీంతో మీ లాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతున్నదని రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కుటుంబ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. అదీగాక ఎంపీగా మీ కూతురు పోటీ చేస్తుందా, మీ అబ్బాయి సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడిగారు. తన భార్య లక్ష్మీ పోటీ చేస్తుందని ఎమ్మెల్యే సరదాగా సమాధానం ఇచ్చారు.
అనంతరం దయచేసి తనను వివాదాల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి అనడంతో.. తర్వాత మాట్లాడదాం అంటూ కేటీఆర్ (KTR) అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) తర్వాతనే మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు.
ఈ మేరకు తన మనసులోని మాటను బయటపెట్టారు. నాకు హోమంత్రి కావాలని ఉందని తెలిపారు. గతంలో అధిష్ఠానం కూడా నాకు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. నేను హోం మంత్రి అయితేనే వాళ్లు నియంత్రణలో ఉంటారని అన్నారు. అయితే ఈ మాటలు ఆయన బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారని అనుకొంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు గాని.. ఇప్పటికే కాంగ్రెస్ లో పదవుల కోసం కీచులాటలు మొదలైయ్యాయని అనుకొంటున్నారు..