దేశంలో సమాచార విప్లవం సాకారమైంది కాని సామాజిక సంబంధాలు మాత్రం విచ్చిన్నమవుతున్నాయి. అక్షరాస్యుల సంఖ్య అధికం అవుతుంది కాని పెరిగిపోతున్న రాక్షస ప్రవృత్తి వల్ల ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు.. లోకంలో నిరంకుశ ధోరణులు పెరిగి దిన దినానికి నేరాలు అధికమవుతున్నాయి. ఈ అకృత్యాల బరువుని భరించలేక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి పెరిగి కుంగిపోతుంది.
దీనివల్ల అతివల ఆక్రందనలు దేశం నలు దిక్కులా ఆణువణువూ వినిపిస్తున్నాయి. దాడులు ప్రతిదాడులు.. హత్యలు..ఆత్మహత్యలు.. పసిమోగ్గలపై పాశవిక ఘటనలు, అమ్మాయిలపై అత్యాచారాలతో కూడిన హింసాత్మక సమాజంలో మనం నివసిస్తున్నామా..? అనే మరకలు మనసుని పీడిస్తున్నాయి.. కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుండి పోతున్న సమాజంలో ఆడపిల్ల బరువుగా మారడం.. నవ సమాజానికి చెదలు పట్టిస్తున్నాయి..
పార్లమెంట్ ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని భద్రత ఏర్పాట్ల పేరుతో భరోసా ఇచ్చినా ఈ అకృత్యాలకు మాత్రం అడ్డే ఉండటం లేదు.. ఆడపిల్ల జీవితాలు గాల్లో దీపాలుగా మారడం ఆగడం లేదు.. ఇకపోతే ఓ యువతి.. మగవాడి ప్రతాపానికి బలైన దారుణమైన సంఘటన నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ (Khanapur) పట్టణంలో చోటు చేసుకొంది. అంబేద్కర్ నగర్ (Ambedkar Nagar)కు చెందిన అలేఖ్య (23), జియా (25) అనే యువతులు కలిసి ఖానాపూర్ మార్కెట్ కు వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో.. శివాజీనగర్ ప్రాంతానికి రాగానే.. ఓ వ్యక్తి గొడ్డలితో వీరిపై దాడి చేశాడు.
ఈ దాడిలో 23 ఏళ్ల అలేఖ్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన జియాను ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఉన్న మూడేళ్ల చిన్నారి రియన్స్ కు సైతం గాయాలు అయ్యాయి. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు.. కానీ దాడికి పాల్పడింది అలేఖ్యకు తెలిసిన వ్యక్తే అంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని హంతకుడి కోసం గాలిస్తున్నారు..