భారత్లో అంబేడ్కర్ (Ambedkar) ఓ అద్భుతమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశానికి అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. బీసీ కమిషన్ తొలి చైర్మన్ బిఎస్ రాములు రాసిన అంబేడ్కర్ ఓ అద్భుతం: ‘బీసీ నోట్’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
పుస్కకావిష్కరణ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతి సామాజిక వర్గానికి, కులానికి జనాభా దామాషా మేరకు ప్రాతినిధ్యం, అవకాశం ప్రతిపాదించి అమలు జరిపితే అన్ని ప్రాంతాలకు, కులాలకు, వర్గాలకు సంబంధించిన వారికి అవకాశాలు అందుతాయని చెప్పారు. తద్వారా ఆయా సామాజిక వర్గాల్లో, కులాల్లో ఒక స్ఫూర్తి, ఉత్తేజంతోపాటు వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని అన్నారు.
ఫలితంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో, ఆచరణలోకి వస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని భారతీయ ఓబీసీ సమాఖ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు, కే. కోటేశ్వర్ రావు, పుస్తక రచయిత, ఓబీసీ సమాఖ్య గౌరవ అధ్యక్షులు బీఎస్ రాములు, అనం చిన్ని వెంకటేశ్వరావు, రాష్ట్ర సభ్యులు చింతకాయల వెంకటేశ్వర్లు, శీలం శ్రీనివాస్ రావు కలిశారు.
కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్వాగతిస్తు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేశారు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్ల అమలు కోసం భారతీయ ఓబీసీ సమాఖ్య చేస్తున్న ఉద్యమానికి మద్దతు కావాలని భారతీయ ఓబీసీ సమాఖ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు, కే.కోటేశ్వర్ రావు, పుస్తక రచయిత, ఓబీసీ సమాఖ్య గౌరవ అధ్యక్షులు బీఎస్ రాములు కోరారు.
ఈ పుస్తకాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, కోమటిరెడ్డి వెంకరెడ్డిలకు ప్రత్యేకంగా భారతీయ ఓబిసి సమాఖ్య సభ్యులు అందచేశారు. అలాగే మిగిలిన అందరి శాసనసభ్యులకు, ప్రభుత్వ అధికారులకు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఓబిసి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరావు, రాష్ట్ర సభ్యులు చింతకాయల వెంకటేశ్వర్లు, శీలం శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.