వేసవికాలం అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. కానీ నగరంలో కాలంతో సంబంధం లేకుండా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్చెరు (Patancheru) మండలం పాశమైలారం (Pashamailaram)లో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.
సీఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ అవడంతో పక్కనే ఉన్న వనమాలి ఫార్మా పరిశ్రమలో కూడా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్లోని కాకతీయ ఆసుపత్రి, పటాన్చెరులోని ధ్రువ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.
మరోవైపు మంటలు అదుపులోకి తెచ్చే క్రమంలో రసాయనాల ఘాటు పీల్చడంతో కొందరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వారిని సైతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు..
ఇక ప్రమాదంపై సమాచారం అందుకొన్న ఆర్డీఓ రవీందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.