తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం(Statue of Rajiv Gandhi) ఏర్పాటుపై కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఆమె సూచించారు. ఈ మేరకు సభలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ను కోరారు.
సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినట్లు గుర్తుచేశారు. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజీవ్గాంధీ దేశానికి చేసిన సేవల పట్ల తమకు గౌరవం అపారమైన గౌరవం ఉందన్నారు. కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అదేవిధంగా వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై కవిత స్పందించారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఎమ్మెల్సీ కవిత తన గళాన్ని వినిపించారు.
వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6377ఉండగా రూ.4వేల నుంచి 5వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతుల ఆందోళన విషయాన్ని సభలో లేవనెత్తారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానలి శాసనమండలి చైర్మన్ను కోరారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.