కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు.. కాల్చివేతలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రజాపాలన అని చెప్పుకొంటూ ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ పాలనలో అనేక ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
సీనియర్ జర్నలిస్టు శంకర్పై కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని ప్రశ్నించారు.. ఈ ఘటనపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని, బాల్క సుమన్ డిమాండ్ చేశారు. చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్ అనే జర్నలిస్టుల మీద కూడా దాడులు, వేధింపులు జరిగాయని గుర్తు చేశారు. ఇందుకోసమేనా కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిందని ధ్వజమెత్తారు..
మరోవైపు మేడారంలో సీఎం రేవంత్ ముందే భక్తులపై లాఠీ చార్జీ చేయడం దారుణమని పేర్కొన్నారు.. ఇప్పటి దాకా 2600 మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు అయ్యాయని.. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా చెలరేగిపోతుందని బాల్క సుమన్ (Balka Suman) మండిపడ్డారు.. విసునూరు రామచంద్ర రెడ్డి, ఎర్ర పహాడ్, ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖ్లలో దళిత బహుజనులు ఎలాంటి దాష్టీకాలు ఎదుర్కోన్నారో ఇప్పుడు నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో అవే దౌర్జన్యాలు ఎదురవుతున్నాయని విమర్శించారు..
పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని.. మా వాళ్ళు ఫిర్యాదు చేస్తే వాటిని చెత్తబుట్టలో వేస్తున్నారని ఆరోపించారు.. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని బాల్క సుమన్ సూచించారు. అదీగాక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ (BRS)కు అనుకూలంగా పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పాశవిక హింసాత్మక ధోరణిని ఇప్పటికైనా మానుకోవాలి అని హెచ్చరించారు.