Telugu News » CAA : సీఏఏకు కొత్త పోర్టల్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే..?

CAA : సీఏఏకు కొత్త పోర్టల్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే..?

2014 డిసెంబరు 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన ఈ మూడు దేశాల హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు వర్తించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు..

by Venu

కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నేపథ్యంలో సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేడు కొత్త వెబ్‌ పోర్టల్‌ https:/indiancitizenshiponline.nic.inను ప్రారంభించింది.

అదేవిధంగా దీంతో పాటు CAA-2019 పేరుతో మొబైల్‌ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాకిస్థాన్‌ (Pakistan), బంగ్లాదేశ్‌ (Bangladesh), అఫ్గానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల దగ్గర తగిన పత్రాలు లేకపోయినా వారికి వెంటనే మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టం (Citizenship (Amendment) Act) తెచ్చింది. అలాగే 2014 డిసెంబరు 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన ఈ మూడు దేశాల హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు వర్తించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు..

ఇక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకొనే విధానం తెలుసుకొంటే..

ముందుగా కొత్తగా ఏర్పాటు చేసిన https:/indiancitizenshiponline.nic.in వెబ్‌పోర్టల్‌కు వెళ్లాలి. ఇందులో ‘సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తుల సమర్పణ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం మొబైల్‌ నంబరు, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేస్తే తదుపరి పేజీ ఓపెన్‌ అవుతుంది. అప్పుడు అక్కడ పేరు, ఈమెయిల్‌ ఐడీ ఇతర వివరాలను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేయవలసి ఉంటుంది.. తర్వాత వివరాలన్నీ సరిచూసుకొని.. సబ్మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి..

తర్వాత మీ ఈమెయిల్‌, మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అది వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్‌ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.. ఇప్పుడు వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత మీ పేరుతో లాగిన్‌ అయి కొత్త దరఖాస్తు బటన్‌పై క్లిక్‌ చేయాలి.. అక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్‌, ఏ దేశానికి చెందిన వారు? భారత్‌కు ఎప్పుడు వచ్చారు ? ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే వీటికి కావాల్సిన పత్రాలు ఏంటో చూద్దాం..

అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్‌పోర్ట్‌, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలను పౌరులు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు 2014 డిసెంబరు 31వ తేదీకి ముందే భారత్‌లోకి ప్రవేశించారని రుజువు చేసే డాక్యుమెంట్లను తప్పని సరిగ్గా ఇవ్వాలి. అంటే, దేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌, భారత్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డు, ఇక్కడే జన్మిస్తే జనన ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్డ్‌ రెంటల్‌ అగ్రిమెంట్‌, పాన్‌ కార్డు, విద్యుత్‌ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, మ్యారేజీ సర్టిఫికేట్‌ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించవలసి ఉంటుంది

You may also like

Leave a Comment