Telugu News » కుంభకర్ణునికి అసలైన వారసులు వీరే!

కుంభకర్ణునికి అసలైన వారసులు వీరే!

మహానేత కట్టించిన ఇళ్లల్లో ఒక్క శాతం కూడా కట్టించడం చేతకాని దద్దమ్మలు మీరు.

by Sai
sharmila-comments

ప్రతిపక్షాలను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన మంత్రి కేటీఆర్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. లోటస్‌పాండ్‌లో శుక్రవారం నాడు మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి గంగిరెద్దులతో ప్రతిపక్షాలను పోల్చే చిన్న దొర కేటీఆర్.. ఎన్నికల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడి అసలైన వారసులే మీరే.ఓట్ల ముందే ప్రజలు గుర్తుకొస్తారు.

sharmila-comments

మీరు నిద్రలేస్తారు.. పథకాలను నిద్ర లేపుతారు.కొత్త కొత్త స్కీంలంటూ పిట్ట కథలు చెప్తారు. మాయమాటలతో మాయాజాలం చేస్తారు. పప్పులుడకవని తెలిస్తే సెంటిమెంట్‌ను రాజేస్తారు.అభివృద్ధి తప్ప అన్ని విద్యలు ప్రదర్శిస్తారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మళ్లీ జనం వైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అణగదొక్కడం, అరెస్టులు చేయడం ఇదే మీకు తెలిసిన విద్య. రెండుసార్లు ప్రజలు పట్టం కడితే పెట్టినవి పంగనామాలే తప్ప.. ఒక్క వర్గానికైనా మేలు జరగలేదు.

8 ఏళ్లలో కేవలం 30 వేల ఇళ్లు కట్టిన మీరే దేశానికి ఆదర్శం అయితే.. 5 ఏళ్లలో 42 లక్షల పక్కా ఇళ్లు కట్టించిన వైఎస్సార్ పాలనను ఏమనాలి?మహానేత కట్టించిన ఇళ్లల్లో ఒక్క శాతం కూడా కట్టించడం చేతకాని దద్దమ్మలు మీరు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన మోసగాళ్లు మీరు. పాలన చేతకాని అసమర్థులు మీరు. 2.90 లక్షల ఇళ్లు కడతామని చెప్పి లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. స్కీముల పేరుతో స్కాంలు చేసి మీరు లక్ష కోట్లు కాజేశారు.

బంగారు తెలంగాణ అని చెప్పి 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు. ఇన్నేళ్లుగా పథకాలను అటకెక్కించి, ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమ అనిపించి.. మరిన్ని కొత్త పథకాలు అని చెప్తే నమ్మే రోజులు లేవు కేటీఆర్. మీ పథకాలు, మీరు అంతా ఒక బోగస్’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment