Telugu News » Bandi Sanjay: బీసీని సీఎం చేసే దమ్ము ఉందా.. రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్…!

Bandi Sanjay: బీసీని సీఎం చేసే దమ్ము ఉందా.. రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్…!

అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందంటూ ఎద్దేవా చేశారు.

by Ramu
bandisanjay sensational comments on rahul gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

bandisanjay sensational comments on rahul gandhi

దేశంలో అధికారం కోల్పోయి కాంగ్రెస్ మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ జపం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందన్నారు. కానీ ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచనే ఆ పార్టీకి రాలేదని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది బీసీలను అవమానించడమేనన్నారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొన్న కేటీఆర్,నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

ఆ నాయకులు వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ తరువాతే బీసీలను ఓట్లు అడగాలని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల నుంచి , ఆ తర్వాత ఎన్నికల నుంచి ఉప ఎన్నికల్లోనూ , స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు తమ పార్టీ ఎండగడుతోందన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ అని చెప్పారు.

ఓబీసీ జపం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఎంతమంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్న పార్టీ బీజేపీనేనని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమా? సవాల్ విసిరారు. ఓబీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు.

పేదింటి ఓబీసీ బిడ్డ నరేంద్ర మోడీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. 27 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన పార్టీ తమదేనన్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ బీజేపీనేనన్నారు. అదే బాటలో తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని స్పష్టం చేశారు.

50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఓబీసీ వ్యక్తిని ప్రధాన మంత్రిని ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయి మనుగడ కోల్పోయాక ఇప్పుడు బీసీ కుల గణన గుర్తుకు వచ్చిందా అని అడిగారు. తెలంగాణలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా హీనదశకు చేరిన తరువాత ఓబీసీలు గుర్తుకొచ్చారా? అని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎంగా చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? అని సవాల్ విసిరారు. ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు నిజంగా బీసీల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ను బీసీలే రాజకీయ సమాధి చేయడం తథ్యమన్నారు.

You may also like

Leave a Comment