Telugu News » Kaleswaram : కాళేశ్వరం అవినీతిపై తేల్చండి.. ఏసీబీకి ఫిర్యాదు

Kaleswaram : కాళేశ్వరం అవినీతిపై తేల్చండి.. ఏసీబీకి ఫిర్యాదు

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని అన్నారు. నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు.

by admin

– కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే సంచలనం
– కాళేశ్వరం అవినీతిపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్
– ఏసీబీని కోరిన హైకోర్టు న్యాయవాది
– ప్రజాధనం దోపిడీ జరిగింది
– ప్రాజెక్టుల పేరుతో దోచేశారు
– కేసీఆర్, కేటీఆర్, హరీష్, మేఘా కృష్ణారెడ్డిపై ఫిర్యాదు

కాళేశ్వరం (Kaleswaram)… 2018లో కేసీఆర్ (KCR) గెలుపునకు, 2023లో ఓటమికి కారణమైంది. వరదల సమయంలో పంజ్ హౌస్ లు మునిగిపోవడం, మేడిగడ్డ (Medigadda) బ్యారేజ్ పిల్లర్లు కుంగడం.. ఇతర ప్రాజెక్టుల్లోనూ లోపాలు కనిపించడం ఇలా ఎన్నో ఎన్నికల సమయంలో కేసీఆర్ కు గుదిబండలా మారి ఓటమి దిశగా పయనించేలా చేశాయి. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని గులాబీ దళం ఎంత చెప్పినా జనం నమ్మలేదు. అయితే.. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చర్చ మొదలైంది.

Shocking Facts on Kaleshwaram Project

గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచేశారని హస్తం పార్టీ ఎప్పుడూ నిలదీస్తూ ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ కొలువుదీరింది. అయితే.. ఇదే రోజున మాజీ సీఎం కేసీఆర్‌ కు షాక్ తగిలింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ ఏసీబీ (ACB) కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని అన్నారు. నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే నిర్ణయం జరిగిందన్నారు. మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. కానీ, పనులు జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, ఎంపీగా కవిత ఎన్నికయ్యారని వివరించారు. ఆ తర్వాత వీరంతా ప్రాజెక్టు అలైన్మెంట్లు, డిజైన్లు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిని, అంచనాలను పెంచారని ఆరోపించారు.

మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీ వద్ద లీకులు కనిపించాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే ఏసీబీకి ఈ ఫిర్యాదు రావడంతో హాట్ టాపిక్ గా మారింది.

You may also like

Leave a Comment