రాష్ట్రంలో అధికారం కోసం బీఆర్ఎస్ ప్రజల సెంటిమెంట్ వాడుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వదిలి అవినీతి కోసం కాళేశ్వరం చేపట్టిందని మండిపడ్డారు. గత పభుత్వం కేవలం వాళ్ళు ఉండడానికి ఖరీదైన బంగ్లాలు నిర్మించుకొన్నారు కానీ.. పేదలకు ఇండ్లు కట్టియ్యక రోడ్డుపాలు చేశారని విమర్శించారు. ఉద్యమకారులు నోరు నొక్కిందని మంత్రి తెలిపారు.
మంచిర్యాల ( Mancherial), ఎమ్మెల్యే (MLA) ప్రేమ్ సాగర్ (Prem Sagar) నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి సీతక్క (Seetakka) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని తెలిపిన మంత్రి.. ఇంద్రవెల్లి పోరాటంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొంటుందని తెలిపారు.
గత ప్రభుత్వం, నిరుద్యోగులకు నోటిఫికేషన్ల పేరుతో మోసం చేస్తే.. తాము ఉద్యోగాల కల్పన చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉందని, అంగన్ వాడి కేంద్రాలు లేవని తెలిపారు. గత పాలకులు మరచిన కడెం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పునరుద్దరణ పనులు చేపడుతామని, ఆదివాసిలు నివసిస్తున్న ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండేలా ముందుకు వెళ్తామని మంత్రి పేర్కొన్నారు.
మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెడితే కొందరు నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డ సీతక్క.. తెలంగాణ (Telangana) కోసం పోరాటం చేసిన కోదండ రాంకు ఎమ్మెల్సీ ఇస్తే ఓర్వలేక కేసు వేశారని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్.. బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ఆరోపణలు చేస్తున్న నేతలు.. ప్రజల్లో వారిపై వ్యతిరేకత ఏర్పడటానికి కారణాలను విశ్లేషించుకొంటే మంచిదని హితవు పలికారు. ఇప్పటికైనా అహంకారం వీడి.. రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాలని సూచించారు..