బిల్డింగ్ కన్స్ట్రక్షన్(Building Construction) 2012 భవన నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ (Apartment)లోని సెల్లార్(Cellar)లో వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు(High Court) స్పష్టం చేసింది. అయితే, వాటిని ముందస్తు అనుమతితో నిర్మించుకోవాలని సూచించింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టేందుకు వీలు ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్లోని మోహన్నగర్లోని సీటీఓ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్లో వాచ్మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్ఎంసీ పోకాజ్ నోటీసును జారీ చేసింది, దానిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్ వాచ్మెన్ గదిని నిర్మించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
అదేవిధంగా భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్కు అవకాశం ఉందని.. మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది వివరించారు. మరోవైపు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. వాచ్మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ను కోర్టు ఆదేశించింది. వాచ్మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే.. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.