Telugu News » RSS : 98 ఏళ్ల ఆర్ఎస్ఎస్.. అనేక సవాళ్లు, విజయాలెన్నో..!

RSS : 98 ఏళ్ల ఆర్ఎస్ఎస్.. అనేక సవాళ్లు, విజయాలెన్నో..!

దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలకు తెరదించి సంఘం సమాజం మమేకం కావాలి. వేల సంవత్సరాల నుండి హిందూ సమాజంలో సామజిక ధార్మిక శక్తే ప్రధానం. రాజకీయాలకు అతీతంగా సంఘం శక్తిమంతమవుతూ క్రమంగా దేశం ఆమూలాగ్ర పరివర్తనకు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నది.

by admin
rss

రాంపల్లి మల్లికార్జున్ రావు, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు

విజయాలకు చిహ్నమైన విజయదశమి పండుగ రోజున 1925లో ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS). ఈ విజయదశమితో 98 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 98 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ దేశమంతా విస్తరించింది.

rss

సంఘం పని అంటే..

1. శాఖా పని
2. సమాజం పని

శాఖల విస్తరణే ఆర్ఎస్ఎస్ వ్యవస్థ విస్తరణ. శాఖలు ఈరోజు దేశంలో భౌగోళికంగా చిన్న వ్యవస్థ అయిన మండలాలకు కూడా విస్తరిస్తున్నది. దేశవ్యాప్తంగా సుమారు 70వేలు ఉంటాయి. సమాజం పనిలో భాగంగా సంఘ కార్యకర్తలు దేశంలో అన్ని ప్రముఖమైన జాతీయ జీవన రంగాలలో ప్రవేశించి వేగవంతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ పనులు చేయటంలో సంఘం స్వాతంత్ర్యం పూర్వం నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నది. రాజకీయ సంస్థల నుండి, రకరకాల సిద్ధాంతాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రయాణాన్ని సాగించింది. రాజకీయాల్లో తిరుగులేని, ఎదురులేని కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ ను ఎప్పుడూ తన ప్రత్యర్థిగానే భావిస్తూ ఏ చిన్న అవకాశం దొరికినా దాడులు చేసేది. ఈ క్రమంలోనే మూడుసార్లు నిషేధించింది.
1. గాంధీజీ హత్యా నేరంపై..
2. ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు కోర్టు తీర్పును ధిక్కరిస్తూ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో.. 3. 1992లో అయోధ్యలో బాబర్ కట్టడం కూల్చివేత సమయంలో..
సైదాంతిక దాడులు, భౌతిక దాడులు కూడా ఎదుర్కొంటూ ఆర్ఎస్ఎస్ ఈరోజు ఒక శక్తివంతమైన వ్యవస్థగా, సంస్థగా వికసించి దేశానికి కేంద్ర బిందువుగా మారింది.

ఈ దేశం ఇండియన్ జాతా లేక ప్రాచీన హిందూ రాష్ట్రమా?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ జీ ప్రారంభించటానికి దారితీసిన దేశ పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పరిస్థితులు ఈ రోజున కూడా ఇంకా ఏ రకంగా కొనసాగుతున్నాయి అనేది మనకు అర్ధమౌతుంది. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 మొదటి స్వాతంత్ర పోరాటం ఒక కీలక ఘట్టం. ఆ తర్వాత దేశం బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. దాంతో బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ ఇండియా భూభాగంలో ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ నిర్మాణం చేయటానికి సన్నాహాలు ప్రారంభించింది. 1857 తదుపరి దేశ స్వాతంత్ర పోరాటం కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఈ దేశంలో అనేక సంస్థలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య పోరాటం కోసం ఆ సంస్థలు పనిచేస్తూ, రాజకీయాలను ఒంట పట్టించుకుని ఎన్నికల్లో పోటీ చేయటం కూడా ప్రారంభమైంది.

సంస్థల వివరాలు

1. 1885 డిసెంబర్ లో కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది
2. 1906 నవంబర్ 30న ముస్లిం లీగ్ ప్రారంభమైంది
3. 1914లో అమృత్ సర్ లో హిందూ మహాసభ ప్రారంభమైంది. ఆ తర్వాత దాని కేంద్రం హరిద్వార్ కి మారింది
4. 1920 అక్టోబర్ 17న సోషలిస్ట్ రిపబ్లిక్ సంస్థగా కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు, వివిధ సిద్ధాంతాల ప్రభావం ఆ సంస్థల మీదపడింది. దాని కారణంగా అవి ఆలోచనలు, సిద్ధాంతాలు వాళ్ళు సృష్టించిన కథనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే..

1. ఆంగ్లేయులు దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దేశం యొక్క శక్తి ఎక్కడ ఉంది అనే విషయాన్ని గమనించి ఆ శక్తిని బలహీనం చేసేందుకు ఇక్కడ ఉండే ప్రజల్లో భేదాభిప్రాయాలు నిర్మాణం చేయాలని తీర్మానించుకున్నారు. దానితో ఆర్య, ద్రవిడ సిద్ధాంతం ఒకటి దేశం మీద వదిలిపెట్టారు. దానిని పాఠ్యాంశంగా చేసి పూర్తి కిందికి తీసుకెళ్లారు. ఆ సిద్ధాంతం ప్రకారం దేశం ఎవరిది కాదు. ఇది ఒక సత్రం లాంటిది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడో ఒకప్పుడు బయటి నుంచి వచ్చిన వారు. అంటే, ఈ దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారు. గ్రీకులు, శకులు, హుణులు, ముస్లింలు, ఫ్రెంచ్, పోర్చుగీస్, డచ్ వాళ్ళు వచ్చారు చిట్ట వరకు ఆంగ్లేయులైన తాము వచ్చాము. కాబట్టి మనందరం ఇక్కడ కలిసి ఉండాలి అనే మాట చెప్పుకుంటూ వచ్చారు. అంటే, దీని అర్థం ఇది ఒక దేశం కాదు. ఇది ఒక జాతి కాదు. ఈ దేశంలో ప్రజలు ఇప్పుడిప్పుడే ఇండియన్ జాతిగా నిర్మాణమౌతున్నారు అనే భ్రమ కలిగించారు. ఇండియన్స్ జాతి అనే భేద తంత్రంలో మన ఆలోచనలు చిక్కుకుపోయాయి.
2. ఐరోపా ఖండంలో భాష ఆధారంగా జాతి సిద్ధాంతం ప్రారంభమైంది. అదే ఐరోపా ఖండం చీలిపోవడానికి దారి తీసింది. జాతి అంటే భాషా, మతం, భూభాగం ఉండాలని తీర్మానించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం భారతదేశం ఒక దేశం కాదు. ఒక జాతి కాదు. ఇది ఇక ఉప ఖండం అని అన్నారు. ఇది అనేక జాతుల సమూహారమని చెప్పారు. ఇక్కడ ఏ జాతి అయినా తమ స్వతంత్రం కోసం పోరాటం గనుక చేస్తే వాళ్లకు మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.
3. ముస్లింలు ఈ దేశం రెండు జాతులు ఉన్నాయని చెప్పారు. ఒకటి హిందువులు, రెండు ముస్లింలు
4. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం తమిళ దేశం, తమిళ భాష, తమిళ జాతి అని మాట్లాడేవారు
5. కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం మనం ఇప్పుడిప్పుడే ఇండియన్ జాతిగా నిర్మాణం అవుతున్నాం. అంటే, వేల సంవత్సరాలుగా ఉన్న ఈ జాతిని, దేశాన్ని.. ఇది ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఇక్కడ ఒక సంస్కృతి లేదు అనే మాటలు మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కేవలం 160, 170 సంవత్సరాలకి పూర్వం ఈ దేశంలో ప్రారంభమైన సిద్ధాంతాలు ఈ దేశాన్ని గందరగోళంలో పడివేశాయి. అంతేకాదు, ఈ దేశం వాళ్ళ తాతల ఆస్తి అన్నట్టుగా రకరకాలుగా ముక్కలు చేయాలని తీర్మానిస్తున్నారు. మహమ్మద్ అలీ జిన్నా దేశంలో ముస్లింలకు ఒక దేశం సృష్టించాలని ప్రయత్నాలు ప్రారంభం చేసాడు. అతను తమిళనాడులోని రామస్వామి నాయకర్ ను కలిసి దేశాన్ని మూడు ముక్కలు చేయాలని చెప్పాడు. ఒకటి ఇస్లామిస్తాన్, రెండు హిందుస్థాన్, మూడు ద్రవిడిస్తాన్. అంతేకాదు, పంజాబ్ వాళ్లకు సిక్కుస్తాన్ కూడా మనం ఏర్పాటు చేయాలని అన్నారు. అంటే, ఈ దేశాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు ముక్కలు చేయాలని తీర్మానించుకుని ఎవరికి వాళ్లు పనిచేయటం ప్రారంభించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో డాక్టర్ జీ కాంగ్రెస్ సంస్థ నుండి బయటకు వచ్చి ఈ దేశం హిందువుల దేశం. ఇది హిందూ రాష్ట్రం. ఈ హిందూ రాష్ట్రాన్ని సంఘటితం చేయాలి. తద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుని వెళ్లాలని తీర్మానించుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారు. దేశంలో ఉన్న గందరగోళ పరిస్థితుల్లో ఈ దేశం ఎవరిది? ఈ దేశంలో మనం ఎవరం? అనే విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ.. డాక్టర్ జీ సంఘ కార్యాన్ని ప్రారంభించారు. ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు సంఘం యొక్క నేపథ్యం మనకు పూర్తిగా అర్థమౌతుంది.

RSS rally 2

బ్రిటిష్ వాళ్లకు ఇది హిందూ రాష్ట్రం. అంటే, హిందూత్వమే భారత జాతీయయత. హిందూ ధర్మం అంటే ఎందుకు అంత భయం?ఎందుకంటే, ఇస్లాం ఆక్రమణ సమయంలో 1857 స్వాతంత్ర పోరాటం సమయంలో ధర్మరక్షణకు హిందువులు చేసిన భయంకరమైన పోరాటాల చరిత్ర వాళ్ళకి తెలుసు కాబట్టి. మనం హిందువులం అనే విషయం మర్చిపోవాలనే హిందూత్వం అంటే మతతత్వం.. ధర్మమంటే మతం అని కథనాలు సృష్టించి వదిలిపెట్టారు. 160, 170 సంవత్సరాల క్రితం వదిలిన ఈ కథనాలు ఇంకా మనలను పూర్తిగా వదిలిపెట్టలేదు. కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఇది హిందూ రాష్ట్రం. మనం హిందువులం. అనే సత్య సిద్ధంతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇవాళ దేశానికి కేంద్రబిందువుగా మారింది.

రాజకీయాలతో సంబంధం లేని ప్రజా సంఘాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సామాజిక క్షేత్రంలో సామాజిక రంగాలలో పనిచేసుకుంటూ వస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలలో భాగంగా సమాజంలో అనేక రంగాలలో సంఘాలు ఏర్పడ్డాయి, కార్మిక రంగం, విద్యా రంగం, వ్యవసాయ రంగం, ఇలా అనేకమైన పనులు విభజన జరిగింది. దానికనుగుణంగా ఈ కాలంలోనే దేశంలో ఏర్పడిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మొదలైన వాళ్లు పనులు కూడా ప్రారంభం చేశారు. 1948 నుండి సంఘం కూడా దానికి అనుగుణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని సామాజిక రంగాలలో ప్రవేశించి పనిచేయటం ప్రారంభించింది. ఆ సంస్థలు ఈరోజు దేశంలో జాతీయ స్థాయిలో కొన్ని మొదటి స్థానంలో, కొన్ని ఏకైక స్థానంలో పనిచేస్తున్నాయి. సంఘ పరిభాషలో వాటిని వివిధ క్షేత్రాలు అంటారు. అటువంటివి అఖిల భారత స్థాయిలో 35 నుంచి 40 వరకు పని చేస్తున్నాయి. పాశ్చాత్య భావజాలంలో, సామ్యవాద భావజాలంలో దేశం కొట్టుకుని పోతుంటే భారతీయ ఆలోచనలకు అనుగుణంగా వివిధ క్షేత్రాలు పని చేస్తూ రాజకీయాలకు అతీతంగా దేశంలో వ్యవస్థ పరివర్తన చేసుకొంటూ వస్తున్నది. సంఘం అంతే చేస్తున్నదా? ఇంకేమైనా చేస్తున్నదా? అంటే ప్రజలలో దేశ సమస్యల పట్ల అవగాహన కలిగించేందుకు జనజాగరణ కార్యక్రమాలు, సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు ప్రారంభం నుండి చేసుకొంటూ వస్తున్నది.

మచ్చుకు కొన్ని ప్రయత్నాలు

1. 1947 నుండి ఐదు సంవత్సరాల పాటు కాశ్మీర్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు. 1952 జూన్ 26న పార్లమెంటు భవనం ముందు 15 వేల మంది ప్రజలు ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించారు. దానితో కాశ్మీర్ సమస్య యావత్ దేశంలో ప్రజల దృష్టికి వచ్చింది.
2. అసోం పరిరక్షణ కోసం 1981వ సంవత్సరంలో చేసిన ప్రయత్నాలలో అసోంలో ఓటర్ల జాబితా నుండి విదేశీయుల పేర్లు తొలగించాలని ఉద్యమం చేసింది. ఎన్నికల కమిషనర్ కు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. సేవ్ అసోం టుడే సేవ్ ఇండియా టుమారో అనే పేరుతో ఒక జాతీయ సదస్సు కూడా నిర్వహించింది. 1983 ఆగస్టు 15 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.
3. 1981వ సంవత్సరం దేశమంతా ఉలిక్కిపడే సంఘటన ఒకటి తమిళనాడు ప్రాంతంలో జరిగింది. తీరుక్వేల్లి జిల్లాలో మీనాక్షిపురం గ్రామంలో వెయ్యి మంది దళిత హిందువులను ఒకేసారి ఇస్లాం మతంలోకి మార్చారు. దీనిపై దేశమంతా ఆందోళన చెందింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఒక్కసారి ఆందోళనకు గురి అయ్యి తన మనసులోని మాటలను వాజపేయితో పంచుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జన జాగరణ కార్యక్రమం జరిగింది. అలాగే సంస్కృతి రక్షణ కోసం సంస్కృతి రక్షా నిధి సేకరణ జరిగింది.
4. 1983 అక్టోబర్ 9న హిమాచల్ ప్రదేశ్ నుండి భారత మాత, గంగా మాత రథయాత్రలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 4 ప్రధాన రథాలు తిరిగాయి. ఈ రథయాత్రలు 50 రోజుల పాటు జరిగాయి. నేపాల్ లోని పశుపతి నాథ్ దేవాలయం నుండి రామేశ్వరం వరకు ఇవి కొనసాగాయి. నేపాల్ బర్మా భూటాన్ లలో కూడా జరిగాయి. ఈ యాత్రలు దేవత్థాన ఏకాదశి నుంచి గీతా జయంతి వరకు దేశమంతా జరిగాయి
5. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1986 నుండి ప్రయత్నం ప్రారంభమై క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకొంది. దేశవ్యాప్తంగా 2 లక్షల 75 వేల గ్రామాల నుంచి రామశిలలు పూజించి పంపారు. దేవాలయ నిర్మాణం కోసం దేశంలో 6 కోట్ల మంది రామభక్తులు ఒక రూపాయి 25 పైసలు నిధిని కూడా సమర్పించారు. 1990 అక్టోబర్ 30న మొదటి కరసేవ జరిగింది. 1992 డిసెంబర్ 6న జరిగిన రెండవ కరసేవలో బాబ్రీ కట్టడం ధ్వంసం జరిగింది. ఆ స్థలంలో చిన్న రామ మందిరం నిర్మాణం చేసారు. ఈరోజు అయోధ్యలో రామజన్మ భూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతున్నది.

జన జాగరణ కార్యక్రమాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజలను భాగస్వాములు చేస్తూ అనేక వేదికల ద్వారా జన జాగరణ కార్య క్రమాలు నిర్వహించింది.
1. గో సంరక్షణకు 1952లో ఒక మహా ఉద్యమం సాగింది. దేశమంతటి నుండి 1,75,39,813 మందితో సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
2. స్వదేశీ ఉద్యమం
3. శివాజీ పట్టాభిషేకం జరిగి మూడు వందల సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా..
4. గురు గ్రంథ సాహెబ్ 400 సంవత్సరంలో ప్రవేశం
5. నారాయణ గురు జయంతి
6. శ్రీ మాత జయంతి
7. 1857 స్వాతంత్ర పోరాటం జరిగి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కార్యక్రమాలు
8. వివేకానంద చికాగో సభలో మాట్లాడి 1993 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్త కార్యక్రమాలు
9. రామసేతు సంరక్షణ ఆందోళన కార్యక్రమం
10. తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమం.. ఇలా అనేక కార్యక్రమాలు జరిగాయి. హిందూ సమాజమే తానుగా, తానే హిందూ సమాజంగా వికసించిన సంఘ వికాస క్రమం చూస్తే..

సంఘ వికాసక్రమం 1925 నుండి..

1. 1926 ఏప్రిల్ 17న సంఘానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అనే పేరు పెట్టారు. ఆ పేరుతో నాగపూర్ దగ్గరలో ఉన్న రాంటెక్ లో రామాలయంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాల సమయంలో సేవా కార్యక్రమం మొదటిది. స్వయం సేవకుల సేవా, వ్యవహారశైలి ప్రజలందరి హృదయాలను చూరకొన్నది. దాంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పేరు నలుగురి నోళ్లలో పడింది.
2. 1925 సెప్టెంబర్ 25న విజయదశమి పండుగ రోజున ప్రారంభమైనా 1926 మే 28న నిత్యాశాఖ భగవాధ్వజ ప్రణామం ప్రార్థనతో మొదలైంది.
3. 1926 సంవత్సరం నుండి రక్షాబంధన్ ఉత్సవం మొదలైంది
4. 1926 డిసెంబర్ 19న సంఘ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఆరోజు జరిగిన సమావేశాలలో డాక్టర్ జీ ని సంఘ ప్రముఖులుగా ఎన్నుకున్నారు.
5. 1928 సంవత్సరం వ్యాసపూర్ణిమ రోజున శ్రీ గురుపూజ ఉత్సవం గురుదక్షిణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 84 రూపాయలు దక్షిణ సమర్పించబడింది.
6. 1928 మార్చిలో మొట్టమొదటిసారి సంఘ ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 99 మంది స్వయం సేవకులు ప్రతిజ్ఞ తీసుకున్నారు.
7. 1928 నుండి హేమంత శిబిరాలు ప్రారంభమయ్యాయి.
8. 1928 నవంబర్ 9, 10 తేదీల్లో నాగపూర్ లో జరిగిన సమావేశాల్లో సంఘ చరిత్రలో కీలకమైనవి. ఆ సమావేశాల్లోనే నవంబర్ 10న డాక్టర్ జీని సరసంఘచాలక్ గా ప్రకటించారు.
9. 1936 అక్టోబర్ 25 విజయదశమి రోజున హిందూ మహిళ జాగృతి కొరకు రాష్ట్ర సేవిక సమితి ప్రారంభించారు. మౌసీజీ అంటే పినతల్లి తల్లి అని అర్థం.
10. 1939 సంవత్సరం అంతంలో వార్ధా జిల్లా సింధీలో నానాసాహెబ్ టాలాటూలే ఇంట్లో పది రోజులపాటు జరిగిన సమావేశాలలో సంఘ నియమావళి, ప్రార్థన, ఆజ్ఞలు, కార్య పద్ధతి, ఆచార సంహిత, ప్రతిజ్ఞ, మొదలైన ఎన్నో విషయాలపై కూలంకుషంగా చర్చించి నిర్ణయించారు. సంఘ ప్రార్థన హిందూ రాష్ట్ర హృదయానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం జరిగింది. ఆజ్ఞలు అన్ని సంస్కృతంలో ఉండాలని నిర్ణయించారు. ఈ సమావేశాలలో సంఘానికి హిందూ రాష్ట్ర స్వరూపం ఇవ్వబడింది. 1940 ఏప్రిల్ 23న జరిగిన సంఘ శిక్ష వర్గ నుండి ఇవి అన్నీ అమలులోకి వచ్చాయి. ఈ సమావేశంలో డాక్టర్ జీ, గురూజీ, అప్పాజీ జోషి, బాలసాహెబ్ దేవరెస్, తాత్యారావు తెలంగ్, విఠల్ రావు ఫతికి, బాబా సాలోప్కార్, నానాసాహెబ్ టాలాటూలే, కృష్ణారావు మోహరీల్ పాల్గొన్నారు.
11. డాక్టర్ జీ 1925లో సంఘాన్ని ప్రారంభించారు. 1940లో ఈ లోకాన్ని విడిచి పెట్టారు. అంటే, వారు సంఘం పని 15 సంవత్సరాలు పాటు చేశారు. ఆ 15 సంవత్సరాలలో దేశంలో 700 శాఖలు ప్రారంభమయ్యాయి. లక్ష మంది స్వయం సేవకులు తయారయ్యారు.
12. 1880వ సంవత్సరంలో చంద్రనాథ్ బసు ద్వారా హిందూత్వ పదం వాడుకలోకి వచ్చింది. 1892లో హిందూత్వ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ప్రస్తుతం లభ్యం కావడం లేదు.
13. మొట్టమొదటి సంఘ శిక్షావర్గ 1929లో నిర్వహించబడింది. ఇందులో 17 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు.
14. 1935 డాక్టర్ జీ సుశిక్షితులైన కార్యకర్తలను దేశం నలుమూలలకు పంపి సంఘ శాఖలు విస్తరింపచేశారు.
15. 1963 జనవరి 26న రిపబ్లిక్ డే కార్యక్రమంలో నెహ్రూ ఆహ్వానం మేరకు 3 వేల మంది స్వయం సేవకులు పరేడ్ లో పాల్గొన్నారు. 1962 సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధానికి కేంద్ర ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ పూర్తిగా సహకరించింది. దానిపై నెహ్రూ ”ఉత్సాహం ఉంటే లాఠీ చాలు బాంబులను ఓడించడానికి” అని సంఘ కార్యకర్తలను ప్రశంసించారు.

సంఘకార్య విస్తరణ క్రమం.. 1925-40 మధ్యకాలంలో..

సంఘం స్వాతంత్రం సిద్ధించడానికి 22 సంవత్సరాలు పూర్వం ప్రారంభించబడింది. 1925 విజయదశమి రోజున సంఘం ప్రారంభిస్తే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో ఉన్న అన్ని ప్రావిన్సెస్ లో సంఘం పని ప్రారంభమైంది. 1940 సంవత్సరం జరిగిన శిక్షావర్గలో డాక్టర్ జీ అనారోగ్యంగా ఉన్నా కూడా చివరి కార్యక్రమంలో కొద్దిసేపు శిక్షార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ”నేను ఈ రోజున ఒక చిన్న హిందూ రాష్ట్ర స్వరూపాన్ని చూస్తున్నాను” అని చెప్పారు.

1940-47 మధ్య కాలంలో..

డాక్టర్ జీ పరమపదించిన తదుపరి గురూజీ సరసంఘచాలక్ అయ్యారు. 1941లో ప్రచారకులు విశేషంగా రావాలని గురూజీ పిలుపునిచ్చారు. దానితో దేశంలో అన్ని జిల్లా కేంద్రాలలో విస్తరణకు విశేష ప్రయత్నాలు జరిగాయి. గురూజీ మార్గదర్శనంలో దేశవ్యాప్తంగా విశేష విస్తరణ జరిగింది. ఆ సమయంలో ముస్లిం లీగ్ దేశ విభజనకు దూకుడుగా పని చేస్తున్నా.. అక్కడక్కడా మతకలహాలు కూడా జరిగాయి. అటువంటి పరిస్థితుల్లో దేశంలో సంఘ శాఖలు విపరీతంగా పెరిగాయి. శాఖలలో సంఖ్య కూడా వరదలా వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ.. దేశం ముక్కలు అయింది. ఆ సమయంలో సంఘం దేశ విభజనను ఆపలేకపోయింది గానీ, విభజించబడినటువంటి భూభాగంలో ఉన్న హిందువులను సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు చేసిన కృషి అనితరమైనది. గురూజీ విభజించిన భూభాగాలలో పర్యటన చేసి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి చివరి హిందువు భారత్ కు వచ్చేవరకు కార్యకర్తలు అక్కడే ఉండి పని చేయాలని చెప్పారు. 1948 సంవత్సరం జనవరి 30వ తేదీ నాడు మహాత్మా గాంధీజీ హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ సంఘాన్ని నిషేధించింది. దానికి ప్రధాన కారణం సంఘం ప్రారంభించబడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థిగా చూస్తూ వచ్చింది. ఏ చిన్న అవకాశం దొరికినా అణిచివేయాలని ఆలోచిస్తూ ఉండేది.

1972 థానే లో సంఘ చరిత్ర మలుపు తిప్పిన సమావేశాలు

1972 నవంబర్ లో ముంబై సమీపంలోని థానేలో దేశంలోని జిల్లా ప్రచారకులు ఆపై వారికి ఐదు రోజులు పాటు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో భవిష్యత్తు సంఘ విస్తరణ యోజనచేయబడింది. జిల్లా కేంద్రాలలో పనుల విషయాలన్నీ కూడా అక్కడ చర్చించబడింది. దేశానికి సంఘ కార్య ప్రణాళిక కూడా సిద్ధం చేయబడింది.

1975-77 మధ్య సంఘంపైన రెండో నిషేధం

1975-77 మధ్య ఆర్ఎస్ఎస్ పైన రెండో నిషేధం విధించబడింది. కారణం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని వచ్చిన కోర్టు తీర్పును ధిక్కరించి తన అధికారాన్ని చలాయించేందుకు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆ సమయంలో దేశంలో జరుగుతున్న నిరసనలను అణిచివేసేందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులను నిర్బంధించి జైలులో వేశారు. ఆ సమయంలో సంఘాన్ని నిషేధించారు. దీంతో ఆర్ఎస్ఎస్ పెద్దఎత్తున ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉద్యమించింది. సంఘం దాంట్లో విజయం సాధించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేసింది. 1979- 80 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరిగింది.

1985-90 మధ్యకాలంలో

1985లో సంఘం ప్రారంభించబడి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరిగింది. 1989వ సంవత్సరంలో డాక్టర్ జీ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా దేశంలో సామాజిక సమస్యల పరిష్కారానికి విశేష ప్రయత్నాలు ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా సేవా నిధి సేకరణ జరిగింది. 1990 సంవత్సరంలో సేవా విభాగాన్ని ప్రారంభించారు.

1996-2001 మధ్యకాలంలో

1996 సంవత్సరంలో ధర్మజాగరణ విభాగం ప్రారంభించబడింది. 1998వ సంవత్సరంలో సంపర్క విభాగం ప్రచార విభాగం ప్రారంభమయ్యాయి. 2000-2001 మధ్యలో సంఘం ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని 4.30 లక్షల గ్రామాలను సర్వే చేసారు. ఆ సర్వే లో దేశంలో 3 విషయాలు ఆశ్చర్యకరంగా సంఘ కార్యకర్తల ముందుకు వచ్చాయి.
1. రాష్ట్రీయ స్వయం సేవవ్ సంఘ్ మంచిది. మీరు పని చేయండి అని చెప్పి.. మన భుజాలు తట్టారు. కానీ, మీతో పాటు దేశం కోసం తాము పనిచేస్తామని దేశ ప్రజలు చెప్పలేదు. ఇది సంఘానికి చాలా ఆశ్చర్యం కలిగించింది.
2. దేశంలో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులను కలుస్తున్నప్పుడు హిందూత్వం అంటే మీకే తెలుసు అని అనుకోకండి. హిందూత్వం అంటే మాకు కూడా తెలుసు. కానీ, మేము ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే హిందూత్వం గురించి మాట్లాడితే గెలవలేము కాబట్టి హిందూత్వాన్ని విమర్శిస్తుంటాము. అలా అని హిందూత్వం అంటే మాకు తెలియదని మీరు అనుకోకండి అని వాళ్ళు చెప్పారు.
3. దేశంలో క్రైస్తవేకరణ ప్రమాదకర స్థాయికి చేరుకొంటోంది అని అర్ధమైంది. దాని తదుపరి దేశంలో గతి విధి పనుల ఆలోచన ప్రారంభమయ్యాయి. క్రమంగా పనులు దేశమంతా ప్రారంభమయ్యాయి.

2006-07 గురూజీ శత జయంతి ఉత్సవాలు

2006-07లో గురూజీ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు, సంఘం ద్వారా దేశంలో మొట్టమొదటిసారి సామాజిక సద్భావన పేరుతో కుల సంఘాల పెద్దల సమావేశాలు.. జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. ఇలా క్రమంగా సామాజిక పరివర్తన కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం ప్రారంభించింది.

2022-23లో పనిలో మార్పులు

ఈ మధ్యకాలంలో సమాజంలో ఉండే పరిస్థితులు సంఘం యొక్క ప్రగతి మొదలైన విషయాలపై చింతను సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల నిర్ణయం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల పాటు సమాజంలో 12 రకాల పనులు జరగాలని నిర్ణయించారు.

1. సేవ
2. సంపర్క విభాగం
3. ప్రచార విభాగం
4. గోరక్షణ గో సంవర్ధన
5. గ్రామ వికాసం
6. ధర్మ జాగరణ
7. సామాజిక సమరసత
8. కుటుంబ ప్రభోధన్
9. పర్యావరణ పరిరక్షణ
10. సామజిక సద్భావన
11. ప్రధాన రహదారులు
12. సంచారజాతులు

ఈ పనులను వేగవంతం చేస్తూ సంపూర్ణ సమాజం యొక్క సామాజిక పరివర్తనకు మనం ప్రయత్నించాలని చెప్పారు. ఈ పనులు 2023 నుంచి క్రమంగా ప్రారంభం అయ్యాయి. 2024-25లో సంఘం శత జయంతి ఉత్సవాలు నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా దేశంలో సామజిక పరివర్తన ధార్మిక చైతన్యం ,ఆర్థిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణలో జల సంరక్షణ భూమి సుపోషణ, ప్లాస్టిక్ ముక్త భారత్, గ్రామాల స్వావలంబన, సార్వభౌమత్వం కాపాడుకోవటం సామజిక ఐక్యత సాధించాలనే లక్ష్యంగా పెట్టుకొని పని చేయడం జరుగుతోంది. దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలకు తెరదించి సంఘం సమాజం మమేకం కావాలి. వేల సంవత్సరాల నుండి హిందూ సమాజంలో సామజిక ధార్మిక శక్తే ప్రధానం. రాజకీయాలకు అతీతంగా సంఘం శక్తిమంతమవుతూ క్రమంగా దేశం ఆమూలాగ్ర పరివర్తనకు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నది.

You may also like

Leave a Comment