నంబర్ వన్ సిటీగా నిలవాలనుకుంటున్న హైదరాబాద్(Hyderabad)నగరం పెను ప్రమాదంలో పడింది. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం(Atmospheric pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నార్త్ ఇండియా(North India)లోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత కాలుష్య నగరంగా గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బెంగుళూరు, చెన్నె, హైదరాబాద్, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్ పీస్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది.
బెంగళూరు, కొచ్చి, చెన్నెలతో పోల్చితే హైదరాబాద్లో కాలుష్య కారకాలు 2.5పీఎంగా ఉన్నట్లు తేలింది. మన నగరంలో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండడంతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోంది. బంజారాహిల్స్లో 127, కేపీహెచీబీలో 124, జూపార్క్ 144, సైదాబాద్లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకుంది.
ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది.