నగరంలో మాదక ద్రవ్యాల దందా యథేచ్ఛగా సాగుతుంది.. ఈ విషయంలో చట్టం ఎన్ని చర్యలు తీసుకొంటున్న నిందితులు మాత్రం తమ చీకటి దందాలు ఆపడం లేదు.. ఇప్పటికే మత్తుపదార్థాల విషయంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయిన కొత్త దారులు వెతుక్కొని స్మగ్లర్లు అధికారులకు చిక్కకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.. ఇలా గంజాయి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ (Hyderabad), బాలానగర్ (Balanagar)లో భారీగా గంజాయి చాక్లెట్లు (Gaja Chacolets) లభ్యమయ్యాయి. ఒడిశాకు చెందిన అనంత కుమార్ ఈ వ్యవహారంలో నిందితుడిగా గుర్తించారు. ఈయన బాలనగర్ ప్రాంతంలోని ఘరక్ కంఠా ప్రాంతంలో చిన్న కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యావసర సరుకులతో పాటు గంజాయి చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం అందుకొన్నారు పోలీసులు..
ఈ మేరకు బాలానగర్ ఎస్వోటీ (SOT) పోలీసులు కిరాణా షాపుపై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా షాపులో మూడు ప్యాకెట్లలో 125 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొన్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడు అనంత కుమార్ గంజాయి చాక్లెట్లను ఒడిశా (Odisha) నుంచి హైదరాబాద్.. బాలానగర్ ప్రాంతానికి తీసుకొచ్చి కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు గుర్తించారు.
ఈ మేరకు నిందితుడిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకొన్నారు. ఇంకా ఈ దందా వెనుక ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విచారణ ప్రారంభించినట్లు వారు తెలిపారు.. ఇలాంటి విషయంలో సహించేది లేదని వెల్లడించారు..