కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలపై బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల అప్పు తీర్చలేక పోయిందని కానీ తెలంగాణ (Telangana)లో గెలిపిస్తే రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ తెలుపడం విడ్డూరమన్నారు. రాజస్థాన్ లో రైతులు బుద్ది వచ్చేలా కాంగ్రెస్ ను ఓడించారని గుర్తు చేశారు..

కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోడీ రైతులకు అండగా నిలిచారని తెలిపిన లక్ష్మణ్.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు సహాయంగా నిలిచింది కేంద్రం అన్న విషయాన్ని గమనించాలని సూచించారు. యూరియా, విత్తనాలపై సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటుందన్నారు. అనవసరమైన ఉచితాలు ప్రకటించకుండా సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు. వ్యవసాయం చేసే రైతులతో పాటుగా కౌలు రైతులకు సబ్సిడీ అందించి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ లను గెలిపిస్తే హామీలు అమలు అవుతాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని తెలిపారు.. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో సొంత ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారని గుర్తు చేసిన లక్ష్మణ్.. కర్ణాటకలో తాగు నీరు కూడా అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు..
తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు తుక్కుగూడలో హామీలు పేరుతో కాంగ్రెస్ మళ్ళీ రాజకీయం మొదలు పెట్టిందని ఆరోపించిన లక్ష్మణ్.. రైతులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని బీజేపీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మళ్ళీ దేశంలో మోడీ నే ప్రధాని అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు..