Telugu News » Rajagopal Reddy : గుడ్ బై బీజేపీ.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా!

Rajagopal Reddy : గుడ్ బై బీజేపీ.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా!

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కార్ పై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయన్నారు రాజగోపాల్ రెడ్డి. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ అరాచక పాలనతో గాడి తప్పిందని విమర్శించారు. అధికార మార్పును కోరుకుంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

by admin
rajagopal reddy

రాజకీయ విశ్లేషకుల అంచనాలే నిజమయ్యాయి. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) బీజేపీ (BJP) కి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR) కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణ (Telangana) ను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్న ఆయన.. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందన్నారు.

rajagopal reddy

ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS) కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ (Congress) ను భావిస్తున్నారని.. అందుకే, తాను కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి.. 15 నెలల క్రితం మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపార్టీలో చేరానని గుర్తు చేశారు.

గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశానని అన్నారు. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వివరించారు. అయినా, స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడిందని తెలిపారు. ఉప ఎన్నికల్లో తన విజయం కోసం ప్రయత్నించిన బీజేపీ నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పారు.

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కార్ పై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయన్నారు రాజగోపాల్ రెడ్డి. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ అరాచక పాలనతో గాడి తప్పిందని విమర్శించారు. అధికార మార్పును కోరుకుంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. దీనికోసం ప్రోత్సహించిన అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు రాజగోపాల్ రెడ్డి.

ఆనాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా తన లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తన ధ్యేయమని తెలిపారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డానన్నారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న తనను ఆదరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

You may also like

Leave a Comment