– మోడీ అంటే నాకెంతో ఇష్టం
– దేశానికి ఇలాంటి బలమైన నాయకులు కావాలి
– నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో..
– ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది
– కానీ, అవి నినాదాలకే పరిమితమయ్యాయి
– బీసీ సీఎం ప్రకటన చేసిన బీజేపీకి..
– మా పూర్తి సహకారం ఉంటుంది
– బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్
భారత్ పై దాడి చేస్తే తిరిగి దాడి చేయగలమని ప్రధాని మోడీ (PM Modi) నిరూపించారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని తనలాగే అంతా అనుకున్నారని.. అందుకే మోడీ ప్రధాని అయ్యారని వెల్లడించారు. బీజేపీ (BJP) బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడీ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఆయన్ను పెద్దన్నగా భావిస్తానన్నారు.

బీసీ సీఎంను ప్రకటించిన బీజేపీకి జనసేన నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో కలిసి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఔర్ ఏక్ బార్-మోడీ సర్కార్’ అని నినదించారు. దీనికోసం తాము మనస్ఫూర్తిగా, శాయశక్తులా కష్టపడుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలన్న పవన్.. ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా పని చేయవద్దని నాయకులకు సూచనలు చేశారు.
ఒకవేళ ఎన్నికలే ధ్యేయంగా ప్రధాని మోడీ పనిచేసి ఉంటే.. 370 ఆర్టికల్ రద్దు చేసే వారే కాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం నిర్మించే వారా? అని వ్యాఖ్యానించారు.