ఇటీవల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్(Ex CM KCR)ను అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్(Former MP D. Ravindranayak) అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్, కేంద్ర విజిలెన్స్ శాఖ మంత్రికి వినతులు సమర్పించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్(Hyderabad Hyderguda NSS)లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు కాగ్ నివేదిక స్పష్టంగా తెలిపిందన్నారు. కేసీఆర్ అరెస్ట్ ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న ఆయన ఆయన జైలుకెళ్తేనే బీజేపీ గెలిచే అవకాశముందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని, ప్రజల డబ్బు, వేల ఎకరాల భూములను దోచుకున్నారని రవీంద్ర నాయక్ ఆరోపించారు. అసైన్డ్,
మిగులు, వక్ఫ్, దేవాలయం, శరణార్థులు, గౌథాన్, భూదాన్, నయీం, మియాపూర్, ఈడీ భూములను క్విడ్-ప్రో ప్రాతిపదికన తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని అన్నారు.
కాగ్ నివేదికతో పాటు వార్తాకథనాలతో నిరంతరం స్పష్టమైన ఆధారాలు బహిర్గతమవుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒక్కటేననే భావన ప్రజల్లో కలుగుతోందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు నమ్మలేదన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.