Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections-2023) నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు(School Holidays) రానున్నాయి. పోలింగ్ జరిగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారంగా ప్రకటించనున్నారు. పోలింగ్ నవంబర్ 30న ఉండగా ఆ రోజుతో పాటు, ఒక రోజు ముందు అంటే.. నవంబర్ 29న కలిపి పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో 80శాతం మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ఒకరోజు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29న ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు నిర్ణీత కేంద్రంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాఠశాలలకు నవంబర్ 29, 30 తేదీల్లో సెలవులు ఇవ్వాల్సిందే.
అయితే, ఉపాధ్యాయ సంఘాలు మరో రోజు సెలవు కోరుతున్నాయి. ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుందని, డిసెంబర్ 1న సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని విన్నవించారు.
ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్రేటర్ హైదరాబాద్ జాబితాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా.. ఇక్కడ మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. తాజా ఓటర్ల జాబితాలో 77,522 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అందులు పురుషులు 23,22,623 మంది, మహిళలు 22,13,902, దివ్యాంగులు 20,207 మంది, ఎన్ఆర్ఐలు 883, సర్వీస్ ఓటర్లు 404, ట్రాన్స్జెండర్ ఓటర్లు 327, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 80,037మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మద్యం సరఫరాపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. తెలంగాణలోని 18 మద్యం డిస్టిలరీలపై నిఘా పెట్టినట్లుగా ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ తెలిపారు. 10 టీమ్ లను ఏర్పాటు చేసి ఒక్కో టీమ్ కి ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఇన్చార్జిగా నియమించినట్లు చెప్పారు. లిక్కర్ ఉత్పత్తి, సప్లై, సంబంధింత రిజిస్టర్లను పరిశీలించినట్లు వివరించారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు మద్యం అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టినట్లుగా వెల్లడించారు.





