తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని ఫైర్ అయ్యారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించడం ఏంటని ప్రశ్నించారు.
రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో బట్టబయలు అయిందని ఆరోపించిన హరీష్ రావు.. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నారని విమర్శలు చేశారు.. ఈ తీరు ద్వంద్వ నీతికి నిదర్శనం అని అన్నారు..
క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా గతంలో సిఫారసు చేసిన సమయంలో.. గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ ని అనగదొక్కాలని చూస్తున్నట్లు ఆరోపించారు. గవర్నర్ స్వయంగా ఈ కుట్రలో భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం అని హరీష్ రావు పేర్కొన్నారు..
మరోవైపు గవర్నర్ తో బీఆర్ఎస్ కు ఉన్న వైరం ఇప్పటిది కాదన్న సంగతి తెలిసిందే.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమిళిసై దూకుడుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అసలే మోనార్క్ లాంటి కేసీఆర్కు ఈ విషయం నచ్చలేదని, ఆయన ఇగో హర్ట్ అయి.. ప్రోటోకాల్ బ్రేక్ చేస్తూ గవర్నర్ ఇగోను హర్ట్ చేస్తున్నారని ఆ సమయంలో పెద్ద రచ్చ జరిగింది. చివరికి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి మారాక కూడా వీరి వైరం అలాగే కొనసాగుతోందని అనుకొంటున్నారు..