ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సార్వత్రిక ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఫలితాల్లో ఎదురు దెబ్బ తగలగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో మరోసారి కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై మండిపడ్డారు.. కాంగ్రెస్ (Congress) పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదని ఆరోపణలు చేశారు..
శుక్రవారం రాత్రి సమయంలో సికింద్రాబాద్ (Secunderabad), ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University), లేడీస్ హాస్టల్ లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించిన సంగతి తెలిసిందే.. అయితే నిందితుల్లో ఒకరిని విద్యార్థినులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై నేడు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటనపై ఎక్స్ (X) వేదికగా కవిత స్పందించారు.
ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా.. ప్రభుత్వం మేల్కోలేదని మండిపడ్డ కవిత (Kavitha).. రెచ్చిపోయిన ఆగంతకులు నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారని వెల్లడించారు.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన మీ ధైర్య సాహసాలను అభినందిస్తున్నానని పేర్కొన్నారు..
మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. ఈ విషయాన్ని డీజీపీకి ట్యాగ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తుండటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హస్తం పై వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొంటున్నారు..