రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థులు 8 మంది విజయం సాధించిన విషయం తెలిసిందే.. అయితే రాష్ట్రంలో సీనియర్ నేతలు ఓడిపోయినప్పటికీ కమలానికి ఉత్తర తెలంగాణ (Telangana)లో కొంత మైలేజీ పెరిగింది. 8 స్థానాల్లో గెలవడమే కాకుండా మరో 18 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ బాగా బలపడుతోందని హైకమాండ్ అంచనాకు వచ్చింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్.. ఢిల్లీలో ఓ వార్ రూం సిద్ధం చేసినట్లు సమాచారం.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వార్ రూం నుంచి చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కనీసం పది నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నించాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు..
అదీగాక రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ప్రస్తుతం క్లస్టర్ సమావేశాలను (Clusters Meetings) నిర్వహిస్తోంది. పది సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఒక క్లస్టర్గా, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి పార్లమెంట్ స్థానాలను మరో క్లస్టర్గా ఏర్పాటు చేసింది.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ స్థానాలతో మూడో క్లస్టర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ కలిపి నాలుగో క్లస్టర్ ఏర్పాటు చేసింది. జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, కరీంనగర్ కలిపి ఐదో క్లస్టర్గా విభజించారు. మరోవైపు ఈ ఐదు పార్లమెంట్ క్లస్టర్లకు రాష్ట్ర నాయకత్వం ఇంఛార్జ్లను నియమించింది.
సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించింది. కాగా కేంద్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలుపొందాలనే కృతనిశ్చయంతో బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది.