కాంగ్రెస్ సర్కార్(Congress Government) ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారంటీల అమలుకు ‘అభయ హస్తం’ దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ దరఖాస్తులను డిజిటలైజ్ చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల(Data Entry Operaters)ను నియమించింది. ఈ క్రమంలో వివిధ కాలేజీల్లో విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
అయితే, తాము చేసిన పనికి ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో అభయహస్తం దరఖాస్తులను డిజిటలైజేషజ్ చేసేందుకు వివిధ కళాశాలలకు చెందిన 130 మంది విద్యార్థుల సేవలను అధికారులు వినియోగించుకుంటున్నారు.
అయితే, వారందరికీ అందుకు తగిన డబ్బులను ఇంతవరకు చెల్లించలేదు. చేసిన పనికి డబ్బులివ్వాలని కోరితే.. అధికారులు నిర్లక్ష్యగా సమాధానం ఇస్తున్నారని వారు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా దిగారు. తాము చేసిన పనికి వెంటనే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం గ్యారంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర పథకాల కోసం మరో 19,92,747 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ బీమా కింద వైద్య పరిమితి రూ.10 లక్షలకు పెంచింది. ప్రస్తుతం మిగతా హామీలపై దృష్టి పెట్టింది.