సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆదివాసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం కాదు.. సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గేలతో చెప్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. అనవసరంగా రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గౌరవంగా, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. అయినా రేవంత్ రెడ్డిలో అభద్రతా భావం పెరిగిపోతోందని అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం నుంచి, సీనియర్ల నుంచి పదవీ గండం ఉందని రేవంత్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే అసహనంగా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం భాషను అందరూ అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కళ్లుండి చూడలేని కబోది రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ విమర్శించారు. విష జ్వరాలతో బాధపడే ఆదివాసి గూడాలు, తండాల్లో వైద్య సదుపాయాలు కల్పించింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
హడావుడిగా రెండు గ్యారంటీలు అమలు చేసి.. మిగిలినవి మర్చిపోయారని విమర్శించారు. తాము మర్చిపోనివ్వమని.. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బాల్క సుమన్ హెచ్చరించారు. కేసీఆర్ను బూతులు తిట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి పెద్దోడు అయిపోడని ఎద్దేవా చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాతపెట్టాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లిపై కపట ప్రేమ చూపించడం కాదని.. దమ్ముంటే అమరవీరుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.