కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఇప్పటికే విమర్శలు చేస్తున్న హరీష్ రావు (Harish Rao).. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేడు భద్రాచలం (Bhadrachalam)లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలతో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.. అనంతరం మాట్లాడిన ఆయన.. కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి పదవిని రేవంత్ రెడ్డికి పెట్టిన భిక్ష అని షాకిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యేవారే కాదని.. పీసీసీ చీఫ్ కాకపోతే ఆయన సీఎం అయ్యేవారే కాదని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సైతం హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన, రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఊహల్లో తెలుతుందని.. ఏవేవో ఊహించుకోంటుందని.. వారు ఊహించుకొన్నట్లు ఏం జరగదని అన్నారు.
బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదని.. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీజేపీని ఢీకొట్టగలదని తెలిపిన హరీష్ రావు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ కీలక నేతలందరిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. ఇక గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసిందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. వారు అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని విమర్శించిన హరీష్ రావు.. తెలంగాణవాదం ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు. అందుకే బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతు లేకుంటే రాష్ట్రం అన్యాయం అవుతుందని తెలిపారు..