అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య ఊహించని స్థాయిలో మాటల యుద్ధం జరిగిందన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరో సారి ఈ రెండు పార్టీల మధ్య వార్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు..
హనుమకొండ (Hanumakonda) జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. అనంతరం కవితపై విరుచుకుపడ్డారు.. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మరచి.. ప్రజలకు మంచి చేయాలని తాపత్రయ పడుతున్న కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదని సూచించారు.. ఈ సందర్భంగా మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
కవిత (Kavitha) నిన్న ప్రభుత్వం పై చాలా మాటలు మాట్లాడారని, ఇంద్రవెల్లి సభలో ప్రభుత్వం డబ్బులు వినియోగించారాని, మలిదశ ఉద్యమకారులకు ఏం చేస్తారని నోటికి వచ్చినట్టు మాట్లాడారని అన్నారు.. ప్రియాంక గాంధీ తో రెండు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించిన కవిత.. నీ అన్న కొడుకు హిమన్ష్ ఏ హోదా తో రాములవారికి పట్టు వస్త్రలు సమర్పించారని సురేఖ ఎదురు ప్రశ్న వేశారు. గతంలో అమెరికాలో అంట్లు తోముకునే మీరు మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు
మరోవైపు లిక్కర్ రాణి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారంటూ ఎద్దేవా చేసిన మంత్రి.. మమ్ములను విమర్శించే ముందు మీ తప్పులను పరిశీలించు కోవాలని సూచించారు. ఇక జ్యోతి రావు పూలె మీద తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యే లు కబ్జాలకు, రౌడీయిజంకే పరిమితం అయ్యి.. రాష్ట్ర సొమ్మును అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు..
మరోవైపు ప్రియాంక గాంధీని అడ్డుకుంటామన్న కవితపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత ప్రియాంక కాలి గోటికి కూడా సరిపోదని మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభ చూసిన బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్ల గక్కుతున్నారని విమర్శించారు. ప్రియాంకది త్యాగాల కుటుంబం అయితే.. కవితది అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవిస్తున్న కుటుంబమని ధ్వజమెత్తారు.