తెలంగాణ (Telangana)అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) నేటి నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే.. ఆ సందర్భంగా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య నెలకొన్న ఘటన చర్చాంశనీయంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చడంపై గులాబీ నేతలు గుర్రుమంటున్నారు.. ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ కేటాయించడంపై రచ్చ మొదలైంది.
ఇన్నర్ లాబీలో ఉన్న కార్యాలయాన్ని.. ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. కాగా ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పై మండిపడుతున్న నేతలు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ఈమేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashant Reddy) ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్కు చిన్న ఛాంబర్ ఇవ్వడం అవమానించడమే అని అన్నారు. మా ఎల్ ఓపికి పెద్ద ఛాంబర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చిన్నది ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి 5గురు సభ్యులు ఉన్నప్పుడు కూడా మేము ఎల్ఓపి రూమ్ ఇచ్చాం.. ఇప్పుడు మా ఎల్ఓపికి ఇచ్చిన రూమ్ విషయంలో మరోసారి ఆలోచించి ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ కోరినట్లు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు.. చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి.. ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ప్రోటోకాల్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై డీజీపీ ఆలోచించాలని వేముల ప్రశాంత్ కోరారు.